10/04/2015
అంబరీషుడు అనే మహర్షి ఘోరమైన తపస్సు చేశాడు. భూమిమీద ఎండిపోయి రాలిన ఆకులు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ కొన్నాళ్ళు, నీటిని ఆహారంగా తీసుకుంటూ కొన్నాళ్ళు, గాలినే ఆహారంగా తీసుకుంటూ కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తరువాత గాలిలో తేలుతూ కొన్ని సంవత్సరాలు తపస్సు చేసాడు. ఆ పిదప జలం లోపల తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఇలా కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి ఒకనాడు తన నీటిలో తన ఎదురుగ వచ్చిన ఒక చేప కుటుంబాన్ని చూసి ఆహా! దీని అదృష్టమే అదృష్టం. చక్కటి భార్య, పిల్లలతో దీని కుటుంబం కళకళ లాడుతుంది. నాకు కూడా ఇలా ఒక కుటుంబం ఉంటె బావుండు అనుకోని ఆ దేశపు రాజు దగ్గరికి వెళ్ళాడు.
ఆ దేశపు రాజుగారికి ముగ్గురు మగ సంతానం. యాభై మంది ఆడ సంతానం. ఆ అంబరీష మహర్షి ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే మహర్షిని ఆహ్వానించి ఆర్ఘ్యపాధ్యాదులు ఇచ్చి గౌరవించి మహర్షి పాదాలను కడిగిన జలాన్ని తలపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడుగగా; భూమీశా! నాకు వివాహం చేసుకోవాలని ఉంది. నీకుమర్తెను ఇవ్వు అని అడిగాడు. మహర్షి! భూసురోత్తమా! తపస్సంపన్నులైన మీమాట నేను కాదనగలనా! స్వయంవరంలో గెలుచుకోండి అని సమాధానం చెప్పాడు మహారాజు. అప్పుడు మహర్షి తన మనస్సులో ఇలా అనుకొన్నాడు.
ఆడపిల్లలు ఎప్పుడైనా తనకు ఈడు జోడుగా, అందంగా ఉండేవాడిని భర్తగా స్వీకరిస్తారు కాని ఎక్కడైనా ముసలివాడిని భర్తగా స్వీకరిస్తారా? వారి రాతి సౌఖ్యాన్ని వృద్ధుడు అందించగలడా? ఒకవేళ అందించినా వృద్ధుడిని ఏ యువతీ కోరుకోదు కదా! ప్రేయసి కోర్కెలను ప్రియుడు తీర్చగలడు కాని వృద్ధుడు తీర్చగాలడా? స్వయంవరంలో దేశదేశాల నుండి ఎందఱో మహారాజులు, వారి బిడ్డలు వస్తారు. వారిలో అందగాడిని కోరుకుంటారు కాని ఈ వృద్ధుడిని కోరుకుంటారా? అని తర్కించి మహారాజు వద్ద సెలవు తీసుకొని మహర్షి వెళ్లి తన తపశ్శక్తితో యువకుడిలా మారి మరలా మహారాజు దగ్గరికి రాగా మహారాజు అంబరీష్ మహర్షిని చూసి ఆశ్చర్యపోయి తన యాభై మంది కుమార్తెలు ఉండే అంతఃపురానికి పంపించాడు.
(పూర్వం మహర్షులు, బ్రాహ్మణులు ఏదైనా కోరితే కాదు లేదు అనకుండా రాజులు ఇచ్చేవారు. తన కూతురు, కొడుకు, ఆస్తి చివరకి ప్రాణంతో సహితంగా ఇచ్చేసేవారు. అది ఆనాటి వారి గొప్పతనం)
ఆ యాభైమంది కుమార్తెలు అంబరీషుడిని చూడగానే మన్మథుడు గాని దిగివచ్చాడా? ఇంద్రుడా! అంటూ చుట్టూ చేరి నాకంటే నాకు నాకు అని ఎగబడ్డారు. మహారాజుగారు విషయం తెలుసుకొని ఈ యాభై మంది కూతుర్లనిమహర్షికి ఇచ్చి వివాహం జరిపించి అతనితోపాటు అడవికి పంపించాడు. అలా తన వెంట వచ్చిన తన భార్యలతో కలిసి అడవిలో తన తపశ్శక్తితో అందమైన భవనం నిర్మించి అనేక భోగాలు అనుభవించాడు. భవనంలో, కొండ గుహలలో, చెట్ల మొదల్లలొ, నదీ తీరాలలో, ఆకాశంలో, పాతాళంలో ఇలా ఇది అది కాకుండా ఆ యాభై మందితో అనేక సంవత్సరాలు కూడి ఐదు వేలమంది సంతానాన్ని పొందాడు.
చివరికి విసుగు చెంది ''నేను మహర్షిని అంట, గొప్ప యోగి నంట, నాకు సంసారమట, యాభై మంది భార్యలట, ఐదు వేల మంది సంతానమట, బుధజనులకు, మహర్షులకు తెలిస్తే నవ్వరా? ఇదంతా చేప సంసారం చూసి, వాటి సంతానాన్ని చూసి నా మనస్సు చేసిన మాయ అని గ్రహించి గొప్ప తపస్సు చేసి హరిని ధ్యానించి హరిలో ఐక్యం అయ్యాడు. యాభై మంది భార్యలు మహర్షిని అనుసరించి హరి ధామం పొందారు. ఆ ఐదువేల సంతానంలో అందరు తల్లి దండ్రుల మార్గాన్ని అవలంభించి శ్రీహరిలో ఐక్యం అయ్యారు. వీరిలో మిగిలిన ముగ్గురు సంతానం మూడు రాజ్యాలకు అధిపతులై పరిపాలించి యజ్ఞ యాగాదులు, క్రతువులు ఒనరించి శ్రీహరిని మెప్పించి వీరు కూడా వైకుంట వాసులయ్యారు..
వేల సంవత్సరాల తపస్సు చేసి చేసిన చిన్న పొరబాటు వలన సంసారం సాగరంలో చిక్కి పూర్వజన్మ కర్మ ఫలం, అతని తపశ్శక్తి వలన తిరిగి నిజం తెలుసుకుని శ్రీహరిలో ఐక్యం అయ్యాడు. భర్తని అనుసరించిన భార్యలు, తండ్రిని అనుసరించిన కొడుకులు కూడా శ్రీహరినే చేరుకున్నారు.
నీతి : భర్త అనుసరించే భార్యలు, తండ్రిని అనుసరించే కొడుకులు సాధించలేనిది ఏముంటుంది? వంశాన్ని పవిత్రం చేసి తరతరాలు చెప్పుకునేలా చరిత్రలో నిలిచిపోయారు.. ఇది కృతయుగంలో జరిగిన ఇతిహాసం..